న్యూఢిల్లీ : రాజ్యసభ నామినేషన్ పత్రాల తిరస్కరణను సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 ప్రకారం.. కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియలో న్యాయపరమైన జోక్యం నిషిద్ధమని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎస్ చందూర్కర్ లతో కూడిన ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. “ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి ఈ కోర్టు లేదా హైకోర్టు రిట్ అధికార పరిధిని వినియోగించుకునే ప్రయత్నం జరిగిన ప్రతిసారి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 329లో పొందుపరిచిన నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కోర్టు ఆ ప్రయత్నాలను తిరస్కరించింది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇటువంటి అంశాల్లో ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడమే సరైన పరిష్కార మార్గమని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. నామినేషన్ పత్రాల తిరస్కరణలో స్పష్టమైన, సుస్పష్టమైన లోపాలకు మినహాయింపు ఇవ్వడమంటే.. ఆర్టికల్ 329లో ఉనికిలో లేని ఒక సూత్రాన్ని జోడించడమేనని పేర్కొంది. అయితే తాము చేసిన పరిశీలనలు, సంబంధిత హైకోర్టులో దాఖలు చేయనున్న ఏ ఎన్నికల పిటిషన్ పైనా ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపవని స్పష్టం చేసింది.
మీనాక్షి నటరాజన్ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 12, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)