ఈ నెల్లోనే మరో రూ.4,600 కోట్లు సేకరణ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి: ‘73 రోజులు.. రూ.22,400 కోట్లు’ ఇది అక్షరాల త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు. రుణభారం తగ్గించుకోవాలని పదేపదే చెబుతున్నప్పటికీ ఆర్థికశాఖ మాత్రం రుణాలవైపే మొగ్గుచూపు చూపాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఆదాయం కన్నా వ్యయం గణనీయంగా పెరిగిపోవడం వల్లే రుణాల కోసం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు చెప్తున్నారు. తొలి త్రైమాసికంలో రూ.27 వేల కోట్లు రుణం తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంకు ఇండెంట్ పెట్టుకోగా, అందులో తొలి 73 రోజుల్లోనే రూ.22,400 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఇంకా మిగిలిన రూ.4,600 కోట్ల రుణాన్ని కూడా త్వరలోనే తీసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం రుణాన్ని 12 విడతలుగా తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే రూ.27 వేల కోట్ల రుణాన్ని తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం రిజర్వ్ బ్యాంకుకు ప్రతిపాదనలు సమర్పించింది. బడ్జెట్లో రూ.75,868 కోట్లు రుణంగా తీసుకోవాలని అంచనా వేయగా, ఇప్పటికే రూ.22 వేల కోట్లకు పైగా కుణం తీసుకోవడం నెలాఖరుకు మరో రూ.4,600 కోట్లు తీసుకునేందుకు నిర్ణయించడంతో రుణ భారం భారీగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఒక త్రైమాసికానికి రూ.27 వేల కోట్ల రుణాన్ని తీసుకుంటే ఏడాది మొత్తానికి రూ.1.08 లక్షల కోట్ల వరకు రుణం చేరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంటే బడ్జెట్లో ప్రతిపాదనల కంటే ఇది పాతిక వేల కోట్లు అధికంగా ఉండటం గమనార్హం.
తీసుకున్న రుణాల పరిస్థితి
రోజు (రూ.కోట్లలో) రుణం
ఏప్రిల్ 3 4,400
ఏప్రిల్ 30 4,400
మే15 4,600
మే 29 4,400
జూన్ 12 4,600
మొత్తం 22,400









కామెంట్లు (0)