న్యూఢిల్లీ : ట్రాన్స్ జెండర్ సవరణ చట్టం-2026 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ చట్టంపై పరస్పర విరుద్ధమైన తీర్పులను నివారించడానికి, పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన కేంద్ర ప్రభుత్వ పిటిషన్ పై కూడా నోటీసు జారీ చేసింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్ ఒకటి పెండింగ్ లో ఉన్నప్పటికీ పలు హైకోర్టులు విచారణ చేపడుతున్నాయని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్,జస్టిస్ వి.మోహన్ లతో కూడిన ధర్మాసనానికి వెల్లడించారు.
ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేసే కేసులన్నీ ఒకే కోర్టులో విచారించాలన్న కేంద్రం అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం బదిలీ పిటిషన్ పై నోటీసు జారీ చేసింది. రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ హైకోర్టులో తదుపరి విచారణలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. అన్ని పిటిషన్ లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయవచ్చని లేదా వాటిని ఏకీకృతం చేసి ఒకే హైకోర్టుకు అప్పగించవచ్చని కూడా ధర్మాసనం సూచించింది. కోర్టు సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాక, జూలైలో ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.







కామెంట్లు (0)