కొలంబొ : వాహనాల దిగుమతులపై 50శాతం సర్ చార్జ్ (అదనపు సుంకం) విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మోటార్ బైక్స్, త్రీవీలర్స్, వాణిజ్య వాహనాలకు సర్ చార్జ్ నుండి మినహాయింపు ఇచ్చినట్లు వెల్లడించింది. దేశీయ కరెన్సీ విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో ఈచర్యలు తీసుకున్నట్లు తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు, ఆర్థికమంత్రి అయిన అనుర కుమార దిసనాయకె శనివారం ఒక ఉత్తర్వును విడుదల చేశారు. షెడ్యూల్ లో పేర్కొన్న దిగుమతి వస్తువులపై, మే 16 నుండి మూడు నెలల పాటు కస్టమ్స్ సుంకంతో పాటు సర్ చార్జ్ కూడా విధించనున్నట్లు పేర్కొన్నారు. మే 15 వ తేదీ లేదా అంతకు ముందు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ సి ఎస్ ) తెరిచిన వాహనాలకు 50శాతం సర్ చార్జ్ వర్తించదు. ఈ ఉత్తర్వులను ఒక “తాత్కాలిక” చర్యగా ఉప ఆర్థిక మంత్రి అనిల్ జయంత ఫెర్నాండో మీడియాకి వెల్లడించారు. వాహనాల దిగుమతులను మూడు నెలల పాటు వాయిదా వేసేలా చేయడమే ఈ చర్య ముఖ్య ఉద్దేశ్యమని, దీంతో విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చని అన్నారు. ప్రస్తుతం కార్లపై కస్టమ్స్ సుంకం 30 శాతంగా ఉందని అన్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో మార్చి చివరి నాటికి 7 బిలియన్ డాలర్లుగా ఉన్న శ్రీలంక విదేశీ మారక నిల్వలు ఏప్రిల్ చివరి నాటికి 6.76 బిలియన్ డాలర్లకు పడిపోయాయని సెంట్రల్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది.
వాహనాల దిగుమతులపై 50శాతం సర్ చార్జ్ : శ్రీలంక
16 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 16, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)