ప్రజాశక్తి….విజయనగరం టౌన్ : ఎంతోమంది విద్యార్దులకు ఉజ్వల భవిష్యత్తు అందించే ఖో ఖో, కబడ్డీ అకాడమీ మూతపడి అనేక ఏళ్లు గడుస్తున్న నేటికి తెరుచుకోలేదు. వైసిపి ప్రభుత్వం హాయంలో మూతపడిన అకాడమీ తెరుచుకోకుండా దిష్టిబొమ్మలా భవనం దర్శనమిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో క్రీడా పాఠశాల తోపాటు, ఖో ఖో కబడ్డీ అకాడమీ నీ తెరిపిస్తామని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా నేటికి అకాడమీ గురించి కనీసం చర్చ కూడా లేకపోవడం విచారకరమని క్రీడాకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అకాడమీకి తెరుచుకుంటుందని ప్రకటించారని, జూన్ దగ్గర పడుతున్నా అకాడమీ గురించి ప్రభుత్వ, క్రీడా శాఖలో కనీసం చర్చ కూడా జరగడంలేదని వాపోతున్నారు. విశాఖపట్నం తో పాటు మరో జిల్లాలో ప్రభుత్వం రెండు అకాడమీలు ఏర్పాటు చేసిందని, కానీ విజయనగరం అకాడమీ గురించి కనీసం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాడమీ ఉన్న సమయంలో విజయనగరం లో ఖో ఖో, కబడ్డీ ఆటలు ఆడుతూ చదువుకుంటూ విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని, అటువంటి అకాడమీని మూసేవేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అకాడమీ లో చేరాలంటే కడపకు వెళ్లాల్సి వస్తుందని, అంత దూరం పిల్లలని పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో విద్యార్థులు క్రీడలకు పిల్లలు దూరం అవుతున్నారని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన హామీ ప్రకారం అకాడమీ పునః ప్రారంభించడంపై దృష్టి సారించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుకుంటున్నారు.
ఎమ్మెల్యే గారు ఖో ఖో, కబడ్డీ అకాడమిపై దృష్టి సారించండి
12 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 12, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)