ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలోని గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని, జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో కొత్తగా 6 బీఎస్ఎన్ఎల్ 4జి టవర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని శనివారం ఉదయం ఎంపి ఉదయ్ శ్రీనివాస్ ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో డిజిటల్ కనెక్టివిటీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గత ఏడాది సెప్టెంబర్లో కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కు లేఖ రాయడంతో పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావించినట్లు తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలను పరిష్కరించి, ప్రజలకు నాణ్యమైన టెలికాం సేవలు అందించాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం, డిజిటల్ భారత్ నిధి పథకం కింద ప్రస్తుతం వినియోగంలో ఉన్న 23 బీఎస్ఎన్ఎల్ 4జి టవర్లకు అదనంగా మరో 6 టవర్లను మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్తగా మంజూరైన టవర్లు ప్రత్తిపాడు మండలంలోని మెట్టుచింత, పాండవులపాలెం, తోటపల్లి, వంతాడ గ్రామాలు అలాగే రౌతులపూడి మండలంలోని ధార జగన్నాధపురం, గిన్నిలారం గ్రామాల్లో ఏర్పాటు కానున్నాయని ఎంపి వివరించారు. కొత్త టవర్ల ఏర్పాటుతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగుపడటంతో పాటు ఆన్లైన్ విద్య, ఆరోగ్య సేవలు, ఈ-గవర్నెన్స్, డిజిటల్ లావాదేవీలు, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని ఎంపి ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు అందించేందుకు తన కృషి నిరంతరం కొనసాగుతుందని ఎంపి స్పష్టం చేశారు.
కాకినాడలో 6 బిఎస్ఎన్ఎల్ 4జి టవర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం : ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 06, 2026, 04:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)