విజయన్ ఇంటిపై ఈడి దాడులను నిరసిస్తూ సిపిఎం ఖండన.
ప్రజాశక్తి- తాడేపల్లి రూరల్ : కక్ష సాధింపు చర్యతో సిపిఎం కేరళ మాజీ సీఎం విజయన్ ఇంటి పై ఈడి దాడులు చేయడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి అన్నారు. విజయన్ ఇంటిపై బిజెపి, ఈ డి దాడులను ఖండిస్తూ గురువారం ఎం టి ఎం సీ పరిధిలోని కొలనుకొండ జాతీయ రహదారి వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముమ్మాటికి కేంద్ర బిజెపి పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అనంతరం అధికారాన్ని అడ్డుపెట్టుకొని సిపిఎం నాయకుల పై దాడులు చేసేందుకు కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. మచ్చలేని నిజాయితీగల కేరళ మాజీ సీఎం విజయన్ పై బురద జల్లెందుకు, కాంగ్రెస్ భాగస్వామ్యంతో ఈడిని అడ్డుపెట్టుకుని దాడులు చేశారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నిన ఎర్ర జెండా భయపడేది లేదని అన్నారు. విజయన్ 18వ ఏటనుండే ఎర్రజెండాను చేతబట్టి పార్టీకి అంకితం అయ్యి పని చేశారని అన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య మాట్లాడుతూ.. కేరళలో సిపిఎం అభివృద్ధిని చూసి ఓర్వలేని బిజెపి, కాంగ్రెస్ లు మచ్చలేని సిపిఎం నాయకుడి ఇంటిపై, బంధువుల ఇంటిపైన 12 చోట్ల ఈడితో దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. విజయన్ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని ఈడి అధికారులే తేల్చారని అన్నారు. ఎవరు ఎన్ని చేసినా ఎర్ర జెండా భయపడేది లేదన్నారు. 10 సంవత్సరాలు కేరళ ముఖ్యమంత్రిగా కామ్రేడ్ విజయన్ ఆదర్శవంతమైన పరిపాలన చేశారని అన్నారు. దేశంలో అవినీతి పాలన చేస్తున్న బిజెపి అవినీతి మరకలను సిపిఎం కు ఆపాదించాలని చూస్తే, సహించేది లేదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాద బిజెపి దాడులను సిపిఎం ఖండిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, సిపిఎం సీనియర్ నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, కాట్రగడ్డ శివన్నారాయణ, చిట్టిబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)