సెన్సెక్స్ 479 పాయింట్లు పతనం
ముంబయి : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కొలిక్కి వస్తుందన్న అంచనాలతో ఇటీవల సూచీలు రెండు వారాల గరిష్ఠాలకు చేరగా.. తాజాగా భారత స్టాక్ మార్కెట్లలో మళ్లీ యుద్ధ భయాలు నెలకొన్నాయి. తాజాగా అమెరికా జరిపిన దాడులతో ధరలు మళ్లీ పెరిగాయి. దీనికి తోడు డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఒక దశలో 700 పాయింట్ల వరకు పతనమైన సెన్సెక్స్.. చివరకు 479 పాయింట్లు నష్టపోయి 76,009కు పరిమితమయ్యింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 118 పాయింట్లు క్షీణించి 23,913 వద్ద ముగిసింది. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, టిఎంపివి, టెక్ మహీంద్రా వంటి షేర్లు రాణించగా, అపోలో హాస్పిటల్స్, విప్రో, భారతీ ఎయిర్టెల్ తదితర షేర్లు నష్టపోయాయి. ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం కరెన్సీ మార్కెట్పై కూడా తీవ్రంగా పడింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 47 పైసలు క్షీణించి 95.73 వద్ద ముగిసింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో 95.43 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రా డేలో 95.33-95.76 మధ్య కదలాడింది.








కామెంట్లు (0)