లండన్ : బ్రిటిష్ టెలికాం దిగ్గజం బిటిలో భారతీ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ తన వాటాను 25 శాతం కంటే ఎక్కువ పెంపునకు ఆ దేశ ప్రభుత్వం నిరాకరించింది. బ్రిటన్లోని దాదాపు 2.2 కోట్ల గృహాలకు ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించే ఓపెన్రీచ్ నెట్వర్క్ ఈ సంస్థ పరిధిలోనే ఉన్నందున.. దేశంలోని కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలపై సార్వభౌమత్వ నియంత్రణను కాపాడుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ ఆంక్షలు సునీల్ మిట్టల్పై లేదా భారతదేశంపై ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత కాదని.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో జాతీయ భద్రత, పటిష్టత దృష్ట్యా ముందస్తు వ్యూహంలో భాగంగానే మార్కెట్కు ఈ స్పష్టత ఇస్తున్నట్లు బ్రిటన్ అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ భారతీ గ్రూప్ ఈ 25 శాతం పరిమితిని దాటి వాటాను పెంచాలని చూస్తే.. అది బ్రిటన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ కింద కఠినమైన అధికారిక భద్రతా సమీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిజానికి బ్రిటన్ ప్రభుత్వంతో సునీల్ మిట్టల్కు దశాబ్దాలుగా అత్యంత బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. 2020లో దివాలా తీసిన బ్రిటన్ స్పేస్ స్టార్టప్ వన్ వెబ్ ను యుకె ప్రభుత్వంతో కలిసే భారతీ గ్రూప్ పునరుద్ధరించింది. ఆ తర్వాత 2024 చివరిలో వివరణాత్మక జాతీయ భద్రతా సమీక్ష అనంతరం, ఆల్టిస్ వ్యవస్థాపకుడు పాట్రిక్ ద్రాహి నుండి 24.5 శాతం వాటాను కొనుగోలు చేయడానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సునీల్ మిట్టల్, గోపాల్ విట్టల్ ఇద్దరూ బిటి బోర్డులో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇందులో భారతీ పెట్టుబడి పెట్టినప్పటి నుండి ఈ టెలికాం సంస్థ షేర్లు 55 శాతం వరకు లాభపడ్డాయి.
Print Editionసునీల్ మిట్టల్కు బ్రిటన్ షాక్
28 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 28, 2026, 11:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)