నియామే (నైజర్): సహారా ఎడారిలో అత్యంత హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. మాలీ దేశంలో పండుగ వేడుకలు ముగించుకుని తిరుగుపయనమైన ప్రయాణికులను మోసుకెళ్తున్న ఒక లారీ ఎడారి నడిబొడ్డున పాడైపోవడంతో.. తీవ్రమైన ఎండలు, దాహానికి తట్టుకోలేక మహిళలు, పిల్లలతో సహా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్లోని అస్సామాకా పట్టణానికి పశ్చిమంగా దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో, అల్జీరియా సరిహద్దుకు సమీపంలో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం నుండి ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. లారీ ఆగిపోయిన తర్వాత వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని, సహాయం కోసం ఎడారి ఇసుక తిన్నెలపై దాదాపు 50 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించారు. ఎట్టకేలకు అస్సామాకా పట్టణానికి చేరుకుని స్థానిక అధికారులకు సమాచారం అందించడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
అక్కడే సామూహిక ఖననం..
సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, అప్పటికే లారీలో ఉన్న 49 మంది మరణించారు. ఎడారిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండటం, మృతదేహాలు ఇప్పటికే కుళ్ళిపోయే స్థితికి చేరుకోవడంతో.. అధికారుల సమక్షంలోనే వారిని ఎడారిలోనే సామూహికంగా ఖననం చేశారు.








కామెంట్లు (0)