అమరావతి : ప్రముఖ ఫోటోగ్రాఫర్ టి. శ్రీనివాస రెడ్డి ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మక 'ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీ' (ఎపిఎస్) అత్యున్నత పురస్కారం ‘MAPS - మాస్టర్’ గౌరవాన్ని కైవసం చేసుకున్నారు. 2026 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన గుర్తింపును ఆయన దక్కించుకున్నారు. ఇద్దరు కళాకారులు పోటీపడగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఫోటోగ్రఫీ రంగంలో ఆయన సాధించిన విజయాలకు ఈ పురస్కారం మరింత గుర్తింపునిచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫిక్ సొసైటీతో తనకు దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉందని అన్నారు. గతంలో తన ప్రతిభను గుర్తిస్తూ 2016లో ఆ సొసైటీ ప్రతిష్టాత్మక 'ఏపీఎస్ ఫెలోషిప్' (FAPS) గౌరవాన్ని అందించిందని తెలిపారు. ఆ గౌరవం దక్కిన పదేళ్ల తర్వాత, ఇప్పుడు అంతకంటే అత్యున్నతమైన 'మాస్టర్' స్థాయిని అందుకున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవం తన బాధ్యతను మరింత పెంచిందని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ప్రతిష్టాత్మక గౌరవాలను (MAPS, MFIP, FRPS, EPSA) సొంతం చేసుకున్న ఆయన తాజా పురస్కారంతో తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారు.
ఫొటోగ్రఫీలో టి.శ్రీనివాస రెడ్డికి ఆస్ట్రేలియా అత్యున్నత పురస్కారం
29 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 29, 2026, 05:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)