ఎపి ఛాంబర్స్ను కోరిన పట్టాభిరామ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బయో డిగ్రేడబుల్ (పర్యావరణ హితంగా భూమిలో కలిసిపోయే) ఉత్పత్తులను ప్రోత్సహించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ను కోరారు. విజయవాడలోని ఎపి ఛాంబర్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యాన బుధవారం జరిగిన సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. ఛాంబర్స్ ప్రతినిధులు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ) ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు స్వచ్ఛాంధ్ర మిషన్ లక్ష్యాలు, వాటి అమలు తీరును ఆయన వివరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహించడం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం, హరిత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఇలకు అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై చర్చించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పట్టాభిరామ్ కోరారు. బయో డిగ్రేడబుల్ ఉత్పత్తుల తయారీదారులకు ముడి పదార్థాలు సరఫరా చేస్తామని, ఆ ఉత్పత్తుల మార్కెటింగ్ బాధ్యతను మెప్మా, సెర్ప్ ద్వారా డ్వాక్రా గ్రూపులు, మహిళా సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు. ‘స్వయం’ అనే బ్రాండ్ పేరుతో వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎపి ఛాంబర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, ఎపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ రావూరి సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బి రాజశేఖర్, మెప్మా ఎఎమ్డి వెంకటేశ్వరరావు, బయో డిగ్రేడబుల్ ఉత్పత్తిదారు హేమసాయిబాబు పాల్గొన్నారు.








కామెంట్లు (0)