స్పిల్వేకు దిగువన బ్రిడ్జి నిర్మాణం, హైవే కనెక్టివిటీ
మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : 2027లో గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును టూరిజం హబ్గా రూపొందించాలని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందుకు తగ్గట్లే లేఅవుట్ ప్లాన్ తయారు చేసేందుకు 9,900 ఎకరాల విస్తీర్ణంతో లైడార్ సర్వే కూడా పూర్తి చేశామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సచివాలయంలో అధికారులతో మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రి జాతీయ రహదారులతో అనుసంధానించేలా పరిశీలిస్తున్నామన్నారు. ప్రాజెక్టును పర్యాటక హబ్గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశించారని వివరించారు. దానికనుగుణంగా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్పిల్వేకు దిగువన బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి డిజైన్లు అనుమతులు, ఇతర పనుల కోసం షెడ్యూల్ ఇవ్వాలని, దానికనుగుణంగా పనులు చేయాలని అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఇసిఆర్ఎఫ్ డ్యామ్ పనులు గ్యాప్-1లో 45 శాతం, గ్యాప్-2లో 22 శాతం పూర్తయ్యాయని స్పష్టం చేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేసి, అనకాపల్లి వరకు గోదావరి జలాలను తీసుకెళ్తామని అన్నారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల టన్నెల్స్ కనెక్టివిటీల పనులు 90 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఇఎన్సి నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు ఎస్ఇ రామచంద్రరావు, మేఘా ఇంజినీరింగ్ సంస్ధ జాయింట్ సిఒఒ సతీష్ బాబు, డిజిఎం మురళి పాల్గొన్నారు.








కామెంట్లు (0)