భారత్కు ఎకనమిక్ పవర్ హౌస్గా ఆంధ్రప్రదేశ్
రెండో నివాసంగా అమరావతిని ఎంచుకోండిసింగపూర్ పారిశ్రామికవేత్తలకు సిఎం చంద్రబాబు పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు రాష్ట్రానిదే పేటెంట్ అని, పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖలో తలపెట్టిన పార్టనర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో సిఐఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి మంగళవారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘సింగపూర్తో భారత్కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయని, మూడు దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని, బ్లూ, గ్రీన్ రాజధానిగా ఓ అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ రూపొందించిందని చెప్పారు. సింగపూర్ పారిశ్రామిక వేత్తలు అమరావతిని, ఆంధ్రప్రదేశ్ను రెండో నివాసంగా ఎంచుకోవాలని సూచించారు. ఎపిలో పరిశ్రమలకు భూమి కేటాయింపు, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామన్నారు. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్కు అనతికాలంలోనే అన్ని అనుమతులు వేగంగా ఇచ్చామని, మరో రెండేళ్లలో ఆ సంస్థ ఉత్పత్తి ప్రారంభించి ఎగుమతులు చేస్తుందన్నారు. గూగుల్ క్లౌడ్ ఎఐ డేటా హబ్ కూడా ఏర్పాటవుతోందన్నారు. ఆ సంస్థకు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయాలని నిర్ణయించామని చెప్పారు. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా ఓ నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్ణయిస్తున్నామని వెల్లడించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్కు రూపకల్పన చేశామని, త్వరలోనే భారత ఎకనామిక్ పవర్ హౌస్గా రాష్ట్రం మారుతుం దన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరినీ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం తెచ్చామన్నారు. వెయ్యి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతంలో 6 ఆపరేషనల్ పోర్టులు, 7 ఆపరేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయని తెలిపారు.
సెమీకండక్టర్ల తయారీకి ఎపి బెస్ట్ డెస్టినేషన్
సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో రాష్ట్రానికి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్లో సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి సెమీకండక్టర్ల తయారీకి ఎపిలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాయలసీమలో త్వరలోనే ఓ సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటవుతోందని తెలిపారు. డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ జెట్ల తయారీ సహా ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా రాయలసీమ ప్రాంతంలో అవకాశాలున్నాయని అన్నారు.
సిబిఎన్@361 డిగ్రీస్.. పుస్తకాన్ని విడుదల చేసిన సిఎం
కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సిబిఎన్@361 డిగ్రీస్.. పాలీమ్యాథ్ పుస్తకాన్ని విడుదల చేశారు. పుస్తకం తొలి ప్రతులను సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, మంత్రి పి నారాయణ.. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులకు అందించారు. ఈ పుస్తకాన్ని రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ రచించారు.
సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లీడర్షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్’ అనే అంశంపై ప్రసంగించిన ఆయన, నగరాల అభివృద్ధిలో సాంకేతికతతో పాటు మానవ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.









కామెంట్లు (0)