మోడీ, ట్రంప్ భేటీ
రష్యాపై బ్రిటన్, కెనడా ఆంక్షలు
పారిస్ : ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. ఫ్రాన్స్లోని ఇవియన్ రిసార్ట్లో మంగళవారం జి 7 దేశాల సదస్సు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ సదస్సు కోసం ఇక్కడికి చేరుకున్న నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జి-7 నేతలతో కలిసి గ్రూపు ఫొటో దిగారు. ఆ తరువాత మోడీ, ట్రంప్తో భేటీ అయ్యారు. గత ఏడాది కాలంలో ఇరువురు నేతలు ఇలా భేటీ కావడం ఇదే తొలిసారి. పైగా గత వారం వాణిజ్యనౌకపై అమెరికా జరిపిన పాశవిక దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన నేపథ్యంలో వీరిరువురు సమావేశమ య్యారు. ఈ సందర్భంగా కీలక అంతర్జాతీయ అంశాలపై ఇతర ప్రపంచ నేతలతో అభిప్రాయాలు పంచుకుంటున్నట్లు మోడీ ఎక్స్లో పోస్టు పెట్టారు. అంతర్జాతీయ సహకారం, సుస్థిరతకు భారత్ నిబద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. మరింత నిలకడతో, సంక్షేమంతో కూడిన ప్రపంచం కోసం సమిష్టి కృషిని ముందుకు తీసుకెళ్లడానికి భారత్ కట్టుబడి వుందని స్పష్టం చేశారు. విశాఖకు చెందిన నావికుడుసహా ముగ్గురిని హత్య చేసిన అమెరికా దుర్మార్గంపై మోడీ ఎక్స్లో ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.
రష్యాపై ఒత్తిడికి జి-7 నిర్ణయం
రష్యా, ఉక్రెయిన్ల మధ్య నాలుగేళ్ళకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి చెప్పేలా రష్యాపై ఒత్తిడి పెంచాలని జి 7 దేశాల నేతలు నిర్ణయించారు. రష్యా తప్పనిసరిగా ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే నని ట్రంప్ నొక్కిచెప్పారు. ఈ సదస్సుకు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్సహా యూరోపియన్ దేశాల నేతలు హాజరయ్యారు. సదస్సు తొలి రోజైన మంగళవారం ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చ జరిగింది. ఆతిథ్య దేశమైన ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య దీర్ఘకాలంగా పోరు కొనసాగుతోంది. మరోవైపు టెహ్రాన్తో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందం వల్ల ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమాలు కొనసాగే ప్రమాదం ఉన్నదని యూరోపియన్ నేతలు ట్రంప్ను హెచ్చరించారు. ఉక్రెయిన్ విషయంలో వ్యూహాన్ని మార్చుకోవాలని ట్రంప్నకు సూచించారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపేలా ఒత్తిడి తెచ్చేందుకు రష్యాపై కొత్తగా ఆంక్షలు విధిస్తున్నామని బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ ప్రకటించారు. ఎల్ఎన్జిని రవాణా చేసే ట్యాంకర్లపై కూడా ఆంక్షలు విధిస్తున్నామని ఆయన తెలిపారు. యుద్ధానికి రష్యా స్వస్తి చెప్పే వరకూ, ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే వరకూ జి-7 భాగస్వాములతో కలిసి పుతిన్పై ఒత్తిడి కొనసాగిస్తామని చెప్పారు. రష్యా షాడో నావికాదళం, ఇంధన ఆదాయాలు, రక్షణ – పారిశ్రామిక, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే శక్తులపై కొత్తగా ఆంక్షలు విధిస్తున్నట్లు కెనడా మంగళవారం ప్రకటించింది.









కామెంట్లు (0)