త్వరలో అమెరికా విదేశాంగ మంత్రి రాక
న్యూఢిల్లీ : భారత్కు ఇంధన ఎగుమతులను భారీగా పెంచేందుకు అమెరికా వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో త్వరలో భారత్లో పర్యటించనున్న తరుణంలో ట్రంప్ యంత్రాంగం ఈ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ఇరాన్ చర్యల వల్ల చమురు కొరతను ఎదుర్కొంటున్న భారత్కు ప్రత్యామ్నాయంగా అమెరికా ఇంధనాన్ని విక్రయించడమే కాకుండా, ద్వైపాక్షిక వాణిజ్య, రక్షణ వ్యాపారాలను పెంచుకోవడంపై యుఎస్ గట్టిగా దృష్టి సారించింది.
పశ్చిమాసియా ఘర్షణలతో ప్రస్తుతం భారత్ చమురు, ఎల్పిజి కొరతను ఎదుర్కొంటుంది. దీనిని అవకాశంగా తీసుకుని భారత్కు పెద్ద మొత్తంలో చమురును సరఫరా చేసి సొమ్ము చేసుకోవాలని యుఎస్ లక్ష్యంగా పెట్టకుంది. భారత్ ఇంధన భద్రత, కొరతను సాకుగా చూపిస్తూ అమెరికా నుంచి మరింత ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాలనే ఒత్తిడిని సైతం దౌత్యపరంగా పెంచుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్ రానున్న విదేశాంగ మంత్రి మార్కో రూబియో చమురు వాణిజ్యంతో పాటు క్వాడ్ కూటమి బలోపేతంపై కూడా కీలక చర్చలు జరపనున్నారు.








కామెంట్లు (0)