తెలుగు సినీ చరిత్రలో 1986 సంవత్సరం నందమూరి బాలకృష్ణ పేరిట సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఒకే ఏడాదిలో వరుసగా ఆరు సూపర్ హిట్ చిత్రాలను అందించి ఆయన 'డబుల్ హ్యాట్రిక్' విజయాల అల్-టైమ్ రికార్డు సృష్టించారు. 'ముద్దుల కృష్ణయ్య'తో మొదలైన ఈ విజయయాత్ర కోటి రూపాయల వసూళ్ల మైలురాయిని దాటింది. ఆ తర్వాత విడుదలైన సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, మరియు అపూర్వ సహోదరులు చిత్రాలు వరుసగా శతదినోత్సవాలు జరుపుకున్నాయి.
చరిత్ర సృష్టించాలన్నా మేమే... దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అని నట సింహం నందమూరి బాలకృష్ణ ఓ సినిమాలో డైలాగ్ చెబుతారు. సినీ ఇండస్ట్రీలో ఆ డైలాగ్ ఆయనకు సరిగ్గా సరిపోతుంది. నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తనదైన డైలాగ్ డెలివరీ, నటనతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒకే ఏడాదిలో ఒకటి లేదా రెండు విజయాలు అందుకోవడమే గగనమనుకునే రోజుల్లో ఏకంగా ఆరు వరుస హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేయడం ఒక్క బాలయ్యకే చెల్లింది. 1986వ సంవత్సరంలో ఆయన సాధించిన ఆ అరుదైన 'డబుల్ హ్యాట్రిక్' ఘనత, 100 రోజుల థియేటర్ పోస్టర్ల ప్రదర్శన ఇప్పటికీ న భూతో న భవిష్యతి. ఆ అద్భుత ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే...
ముద్దుల కృష్ణయ్య
1986, ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తెలుగునాట సరికొత్త చరిత్ర సృష్టించింది. 'మంగమ్మగారి మనవడు' తర్వాత బాలయ్య పల్లెటూరి వేషధారణలో కనిపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతకుముందు తన పేరిటే ఉన్న మొదటి వారం వసూళ్ల రికార్డును బద్దలు కొడుతూ, తొలిసారిగా కోటి రూపాయల మార్కును దాటిన చిత్రంగా ఇది ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది. 28 కేంద్రాలలో 100 రోజులు, 20 కేంద్రాలలో రజతోత్సవం (175 రోజులు), 10 కేంద్రాలలో 200 రోజులు ఆడి రికార్డులు తిరగరాసింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి మూడు ప్రధాన కేంద్రాలలో గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవం) జరుపుకుంది. మహామహులైన ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక హీరో బాలకృష్ణే. దీని వంద రోజుల వేడుకను మద్రాసులోని 'వల్లువార్ కొట్టం'లో నిర్వహించగా, ఒక తెలుగు హీరో సినిమా కోసం తమిళనాడులో ఆ స్థాయిలో అభిమానులు తరలిరావడం ఒక అద్భుతం.
సీతారామ కళ్యాణం
ఏప్రిల్ 18న విడుదలైన ఈ సినిమా రోజునే భారత్-పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితమైన షార్జా కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆఖరి బంతికి మియాందాద్ సిక్స్ కొట్టి భారత్ను ఓడించడంతో దేశమంతా క్రికెట్ ప్రేమికులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కానీ, అదే రోజు విడుదలైన 'సీతారామ కళ్యాణం' తెలుగు ప్రేక్షకుల బాధను మర్చిపోయేలా చేసింది. లవర్ బాయ్గా, కాలేజీ విద్యార్థిగా బాలయ్య నటనకు యువత ఫిదా అయ్యారు. 14 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, శ్లాబ్ సిస్టమ్లో ఒక స్టార్ హీరో సినిమా రోజుకు 5 ఆటలతో 100 రోజులు ప్రదర్శితమవ్వడం అనే సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. ఇందులోని పాటలు నేటికీ ఎవర్గ్రీన్.
అనసూయమ్మ గారి అల్లుడు
జులైలో విడుదలైన ఈ చిత్రంతో బాలయ్య తన కెరీర్లో తొలి హ్యాట్రిక్ను పూర్తి చేసుకున్నారు. అత్తా-అల్లుళ్ల సవాళ్లు, వినోదభరితమైన కథాంశంతో సాగిన ఈ సినిమాకు మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. భారీ వర్షాలు కురుస్తున్నా లెక్కచేయకుండా గొడుగులు పట్టుకుని మరీ థియేటర్ల వద్ద క్యూ కట్టడం విశేషం. నైజాంలో విడుదలైన ఐదు కేంద్రాలలోనూ నేరుగా 50 రోజులు ఆడి, 8 కేంద్రాలలో హౌస్ఫుల్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించి, మొత్తంగా 200 రోజులు ప్రదర్శితమైంది.









కామెంట్లు (0)